హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో యువతకు పెద్ద పీట వేయాలని కేంద్రం భావిస్తోందా?.. దేశంలో మూడు వంతులకు పైగా ఉన్న యువతను ప్రభుత్వ కొలువుల్లోకి తీసుకుని పాలనలో సంస్కరణలు తీసుకురావాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోందా? కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 7వ పే రివిజన్ కమిషన్ ఇటీవల చేస్తున్న కసరత్తు చూస్తుంటే.. ఇలాంటిదేదో జాతీయ స్థాయిలో జరుగుతోందని అర్థమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేంద్ర సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగుల సేవలను 33 ఏళ్లకు పరిమితం చేయాలనే ప్రతిపాదన సర్కారు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఏ వయసులో చేరినా.. 60 ఏళ్లకు రిటైరవుతున్నారు. అయితే తాజా ప్రతిపాదన ప్రకారం ఒక ఉద్యోగి కేంద్ర సర్వీసుల్లో ఎప్పుడు చేరినా 60 ఏళ్లకు గానీ, 33 ఏళ్ల సర్వీసు పూర్తయినాగానీ.. ఏది ముందు అయితే అప్పుడే రిటైర్ కావాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే 25 శాతం ఉద్యోగులు రిటైరవుతారని గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ విధానం ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అఖిల భారత సర్వీసులకు కూడా వర్తించనుంది. దీనిపై 7వ పే కమిషన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అలాగే, దీని అమలుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఎంత మంది ఉద్యోగులు ఈ నాలుగేళ్లలో రిటైరవబోతున్నారనే డేటాను కూడా సేకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసులతో పాటు రైల్వే, రక్షణ శాఖల్లో కూడా ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. 21 ఏళ్లకు ఉద్యోగంలో చేరినవారు 54 ఏళ్లకే రిటైరవుతారు.
సీన్ రివర్స్....
మోదీ ప్రధాని అయిన తర్వాత కేంద్రంలో రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతారని ఊహగానాలు ఊపందుకున్నాయి. అయితే ఉద్యోగులు ఆశలపై నీళ్లు చల్లుతూ సీన్ రివర్సు అయింది. ఎక్కువ మంది యువతకు సర్కార్ కొలువులందానే ఉద్దేశంతో ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని పెంపుదల నిర్ణయాన్ని నిలివేసింది. ప్రధాని సూచనతోనే 7వ పే కమిషన్ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఉద్యోగాల నియామకాల్లో అనూహ్యమైన మార్పులొస్తాయని భావిస్తున్నారు.
0 comments:
Post a Comment